సీఎం కావడం తర్వాత సంగతి.. ముందు ఎమ్మెల్యే సీటు ఉంటే చాలన్నట్లుగా ఉంది వాళ్ల పరిస్థితి. కొద్ది రోజుల కిందటి వరకు కాబోయే సీఎం నేనంటే.. నేనంటూ.. భారీ స్థాయిలో డైలాగులు.. ప్రకటనలు గుప్పించిన ఆ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే కావడం కోసం చెమటోడ్చుతున్నారు. సీఎం కావాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలి. తన గెలుపుతో పాటు.. తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. వారి కోసం ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో పాల్గొనాలి. అలాంటి నేతలు ఎవ్వరూ ఎక్కడా కనిపించడం లేదు. ఇదంతా ఎవరి కోసమో.. ఏ పార్టీ నేతల కోసమో.. ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది. అవును.. కాంగ్రెస్ నేతల గురించే. సీఎం అవుతామని కలలు కంటున్న వారి గురించే.
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల కు కొదవ లేదరు. ఎవరికి వారు తానే సీఎం అని చెప్పుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్, సీతక్క.. ఇలా చాలా మందే ఉన్నారు. బీఆర్ ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ.. ఓటర్లే లేరని ఎద్దేవా చేశారు. సీఎం ఎవరో ప్రకటించి ప్రచారం చేయాలని సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ సంగతి అటుంచి.. ఆ సీఎంల సంగతికి వద్దాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్. సీనియర్ లీడర్ జానారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమకు సీఎం కావాలని ఉందనే కోరికను బాహాటంగానే ప్రకటించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అయితే ఈ మధ్య ఎప్పుడు చూసినా సీఎం పదవిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు ఇప్పుడే సీఎం కావాలని లేకున్నా భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతానంటూ ప్రకటనలు చేస్తున్నారు. అటు జగ్గారెడ్డి సైతం దసరా పండుగ సందర్భంగా తనకు సీఎం కావాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు.
ఎవరికి వారు సీఎం కావాలని ఉందని చెబుతున్నారు కానీ.. ఆ స్థాయిలో పార్టీకి పని చేయడం లేదు. అందుకు కారణం ఇప్పుడు వాళ్ల పరిస్థితే బాగాలేకపోవడమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం సంగతి పక్కనపెట్టి.. ముందు ఎమ్మెల్యేగా గెలిచేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో పైన చెప్పిన ఆ వ్యక్తులు ఎవరూ ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థుల తరపున ప్రచారంలో కనిపించడం లేదు. ఒకటి రెండు చోట్ల భట్టి విక్రమార్క ప్రచారం చేసినప్పటికీ ఇప్పుడు ఆయన కూడా మధిరకే పరిమితం అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుజూర్నగర్ కే పరిమితం అయ్యారు. గెలవడం కోసం ఎప్పుడూ చేయని రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా కిడ్నాప్ రాజకీయాలకు తెర తీశారు. తన తరపున ఎన్నికల నిర్వహణ చూసే ఏజెన్సీ ప్రతినిధులను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. కిడ్నాప్ చేశారంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఎక్కేగడప..దిగే గడప లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అప్పుడప్పుడు సతీమణి పద్మావతి తరఫున కోదాడ లో తప్ప ఉత్తమ్ ఎక్కడికీ ప్రచారానికి వెళ్లడం లేదు.
వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చిన ఉత్తమ్ ఇప్పుడు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్, కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ విజయం సాధించారు. అయితే నల్లగొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి పద్మావతిని నిలబెట్టినా.. గెలుపు మాత్రం టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన సైదిరెడ్డిని వరించింది.
తెలంగాణా రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో కీలక పోటీ ఉన్న స్థానాల్లో మధిర ఒకటి. రెండున్నర లక్షలమంది ఓటర్లలో ఎనిమిదిన్నర వేల మందికి పైగా ఉన్న కొత్త ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలతో పాటూ, పలు ఇతర పార్టీలు, ఆరుగురు స్వతంత్రులు, మొత్తం 15 మంది బరిలో ఉండటంతో మధిర శాసనసభ నియోజక వర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క ఇక్కడ పోటీలో ఉన్నారు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అయినప్పటికీ.. ఆయన కూడా సొంత నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత కేవలం తన గెలుపుపైనే దృష్టి సారించారు. గత మూడుసార్లు పోటీచేసి భట్టి చేతిలో ఓటమిపాలయైన లింగాల కమల్ రాజు నాలుగో సారి కూడా ఇక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ ఉండడం, ఆయన వైపు సానుభూతి పవనాలు వీస్తుండడంతో భట్టి నియోజకవర్గాన్ని వదిలివెళ్లడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నల్గొండ బరిలో పోటీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన గత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నల్లగొండలో తనకు తిరుగు లేదనుకున్న వెంకటరెడ్డి ని ఇప్పటికీ ఆ ఓటమి భయం వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎంపీగా ఉన్నప్పటికీ, ఆయన ఫోకస్ అంతా నల్లగొండ మీదనే పెట్టారు. అయినప్పటికీ కొంతమంది అధికార పార్టీ బిఆర్ఎస్ లోకి వెళ్ళడం ఆయనకు షాక్ కలిగించింది. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడులో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి లోకి వెళ్లడంతో వెంకటరెడ్డిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం అన్నాదమ్ములు ఇద్దరూ కాంగ్రెస్ నుంచే పోటీ ఉన్నా.. సొంత నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కోరిక తీరాలంటే ఈ ఎన్నికలలో గెలవక తప్పని పరిస్ధితి ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతానని పలుమార్లు చెప్పుకున్నారు. దీనిపై మంత్రి హరీశ్ మాట్లాడుతూ ఆయన సంగారెడ్డి నుంచి గెలిచే పరిస్థితి లేదని, సీఎం అవుతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఫైర్బ్రాండ్ జగ్గారెడ్డి మరోసారి గెలిచి రాష్ట్రస్థాయిలో కీలక పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతుంటే.. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ గత ఓటమి ‘చింత’ను తీర్చుకునేందుకు అభివృద్ధి అస్త్రాలను సంధించడంతో గట్టి పోటీ ఎదురవుతోంది. హోరాహోరీగా తలపడుతున్న వీరిలో సంగారెడ్డి గెలుపు కోసం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఒక్క అవకాశం అంటూ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పులిమామిడి రాజు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఇక ములుగు అసెంబ్లీ బరిలో సీతక్క కు ఈసారి గెలుపు కాస్త కష్టంగానే ఉంది. రెండు పార్టీల నుంచీ విప్లవ భావాలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడమే ప్రధాన కారణం. ఇక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా జెడ్పీ ఇంచార్జి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడానికి తోడు ఇద్దరికి కూడా నక్సల్స్ నేపథ్యం ఉండడంతో ఇక్కడ గట్టి పోటీ ఉండనుంది. ఇటీవల సీతక్క పలు సందర్భాల్లో చూపిన అసహనంతో ఆమెకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సీతక్క నియోజకవర్గంలోనే ఉండి తన గెలుపు కోసం పోరాడుతున్నారు. మరో సీనియర్ నేత జానారెడ్డి అయితే పోటీ నుంచి ముందే తప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన కుమారుడు తరఫున ప్రచారానికి పరిమితం అయ్యారు. మధు యాష్కీ గౌడ్ కూడా తాను పోటీ చేస్తున్న ఎల్బీనగర్ లో తప్పా.. ఎవరి తరఫున ప్రచారం చేయడం లేదు. ఆయనకే గెలుపుపై నమ్మకం లేక ప్రచారానికి రావాల్సిందిగా ఇతర సీనియర్ నేతలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఉంది.. ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం పరిస్థితి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE