తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.. రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేస్తూ.. బాగా నీరసించిపోయారు. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా నిమ్స్ కు తరలించారు. చావు నోట్లో వరకూ వెళ్లి కేసీఆర్ తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రతీ సభలోనూ ఆయన చెబుతూనే ఉన్నారు. రాష్ట్రం కోసం ఏళ్ల తరబడి ధైర్యంగా కొట్లాడిన కేసీఆర్ చివరకు లక్ష్యాన్ని సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేందుకు ఢిల్లీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఉమ్మడి కూటమి నుంచి చంద్రబాబు.., ఏపీ మంత్రులు కూడాg తెలంగాణను చుట్టేశారు. ఈ బక్కకేసీఆర్ ను కొట్టేందుకు ఇంత మందా.. అబ్బబ్బా.. నరేంద్ర మోదీ.. అమిత్ షా.. సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ.. సీపీఐ.. సీపీఎం.. ఆంధ్రా కెళ్లి చంద్రబాబు.. వాళ్ల దుంపల్ తెగ.. అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. వాళ్లు ఎంత మంది వచ్చి ప్రచారం చేసినా.. ముందే చెప్పినట్లుగా కేసీఆర్ గెలిచి చూపించారు.
అయితే.. అది ఉద్యమం రాజకీయం కాదు. ఆ తర్వాత రాజకీయాలు నడిచినా.. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు పెద్ద వ్యతిరేకత లేదు కాబట్టి అధికారంలోకి వచ్చింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. రాష్ట్రం మొత్తం వేరే పార్టీ గాలి వీస్తోంది. మౌత్ టాక్ కేసీఆర్ కు వ్యతిరేకంగా వినిపిస్తోంది. కొందరు బీఆర్ ఎస్ ప్రముఖులు సైతం నీళ్లు నములుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా గతానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. మేమూ మనుషులమే.. కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం.. అంటూ ఎడిటర్లతో ముఖాముఖిలో చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి సర్కారు చేసిన కొన్ని పనులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని కేటీఆర్ గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఓ వర్గం ప్రజల్లోనూ.. సొంత పార్టీ నేతల్లోనూ బీఆర్ ఎస్ గెలుపుపై ఎక్కడో అపనమ్మకం ఉన్నప్పటికీ.. ఫుల్ కాన్పిడెంట్ గా ఉన్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. గతం కంటే ఎక్కువ సీట్లతో మూడోసారి అధికారంలోకి వస్తామని చాలా నమ్మకంగా చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటన.. బీ ఫారాలు పంపిణీ సమయంలో ఎంత నమ్మకంగా ఉన్నారో.. కేసీఆర్ లో ఇప్పటికీ అదే ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది. కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మనమే అంటూ పార్టీ శ్రేణుల్లో అదే ఆత్మ విశ్వాసం పెంపొందిస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో మాత్రం ఏ నలుగురిని కదిపినా.. ఇద్దరు కాంగ్రెస్ గాలి వీస్తోందని కచ్చితంగా చెబుతున్నారు. ఇటువంటి సమయంలో కూడా మళ్లీ అధికారంలోకి మనమే అని కేసీఆర్ చెబుతుండడం ఆలోచింపచేస్తుంది. పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఎందుకంటే.. కేసీఆర్ రాజకీయంగా అపర చాణుక్యుడు. దేశంలోనే గుర్తింపు పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరు. జాతీయ పార్టీగా టీఆర్ ఎస్ ను మార్చకముందే ఆయన జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. కేసీఆర్ చెబితే చేస్తారన్నట్లుగా.. 2018 ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు. విస్తరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాగే.. నాటి ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అదే జరిగింది. విపక్ష కూటమి నుంచి ఎంత మంది దండెత్తినా కేసీఆర్ ను ఏమీ చేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ 95 నుంచి 100 సీట్లతో అధికారంలోకి వస్తామని అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ సమయంలో చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. గాలి మరో పార్టీ వైపు వీస్తుందన్న ప్రచారం జోరుగా ఉంది. కేసీఆర్ మాత్రం మళ్లీ బీఆర్ ఎస్ ప్రభుత్వమే అని ఇప్పటికీ కచ్చితంగా చెబుతున్నారు.
దాని వెనుక కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలు ఉన్నాయా.. అంటే అవును అన్నట్లుగానే తెలుస్తోంది. గతంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లోని కొందరికి కేసీఆరే ఫండింగ్ చేశారని, వారు కాంగ్రెస్ లో గెలిచినా బీఆర్ ఎస్ కే మద్దతు పలుకుతారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు సంచలనం రేపాయి. అలాగే.. కేసీఆర్ సర్కారు ఎన్నికలకు వెళ్లబోయే ముందు కాంగ్రెస్ ముఖ్య నేతలకు చెందిన కొన్ని ఫైళ్లకు చకచకా మోక్షం కలిగించారని ప్రచారంలో ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ సీనియర్ నేత కు చెందిన సుమారు వంద ఎకరాల భూమికి సంబంధించిన చిక్కులు తొలగిపోవడానికి కేసీఆర్ సహకారం అందించినట్లుగా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనికి తోడు.. కాంగ్రెస్ లోని సీనియర్లలో కొందరు హైకమాండ్ తో కొట్లాడి.. బతిమలాడి.. పదేసి సీట్లు తమ వారికి ఇప్పించుకున్నారు.
ఆ తరహా నాయకులందరూ కాంగ్రెస్ లో నెగ్గినప్పటికీ.. ఫలితాలు కాస్త అటు.. ఇటూ వచ్చినా బీఆర్ ఎస్ కే సపోర్టు చేస్తారన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేసీఆర్ అంత ధైర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. కేసీఆర్ ఆషామాషీ నేత కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ కేసీఆర్ రాక మునుపే 50 ఏళ్లుగా పలు ఉద్యమాలు జరిగాయి. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. కాల్పులు జరిగాయి. కర్ఫ్యూలు కొనసాగాయి. కానీ కేసీఆర్ సారథ్యంలో 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం మలిదశ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు 2009, నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభంతో ఉద్యమం వేడెక్కింది. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ దీక్షే కీలక ఘట్టం. ఆ తర్వాత కాసోజు శ్రీకాంతచారి ఆత్మార్పణతో తెలంగాణ రగిలిపోయింది. కేసీఆర్ దీక్ష.. విద్యార్థుల ఆందోళనలతో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది.
నాడు కాంగ్రెస్ మెడలు వంచి.. చావు నోట్లోకి వెళ్లొచ్చి.. మరీ తెలంగాణ సాధించిన కేసీఆర్.. ఇప్పుడు అదే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటే అంత ఈజీగా ఊరుకుంటారా? ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు.. ఏదొకటి చేసి తెలంగాణలో మరోసారి కేసీఆరే అధికారంలోకి వస్తారు.. అని కొందరు మేధావులు భావిస్తున్నారు. బండి సంజయ్ గతంలో చేసిన ఆరోపణల ప్రకారం.. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనడాన్ని కొట్టి పారేయలేమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే ఫలితాలను బట్టి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయని అర్థమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE