కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషన్ కెఐ వరప్రసాద్ రెడ్డి ప్రగతి భవన్ లో మార్చ్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా ఒక కోటి 116 రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ కి వరప్రసాదర్ రెడ్డి అందించారు.
కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి కూడా సీఎం కేసీఆర్ ను కలిసి తమ కంపెనీ తరుఫున కోటి రూపాయల చెక్కును సిఎంఆర్ఎఫ్ కు అందించారు. అలాగే లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి సీఎంను కలిసి తమ ల్యాబ్ తరుఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షల చెక్కును అందించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సిఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా మెగా గ్రూప్ కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి జరగుకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపడంతో పాటుగా, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్పూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు.