సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించాలి – మాజీ మంత్రి హరీశ్‌రావు

Ex Minister Harish Rao Demands Probe on 308 Acres Of CM Revanth Reddy’s Family

తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల భూములపై బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లపై మొత్తం 308 ఎకరాల భూములు ఉన్నాయని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. రేవంత్‌ రెడ్డి కుటుంబ భూములకు సమీప ప్రాంతాల గుండా రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ప్రతిపాదిత బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాల అలైన్‌మెంట్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలు చేశారు. భూముల వివరాలతో పాటు ఆయా ప్రాజెక్టుల అలైన్‌మెంట్లపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కోట్రా గ్రామంలో రేవంత్ కుటుంబానికి పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయని రైతులు చెబుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. అందులో 175 ఎకరాలకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లిలో ఉన్నట్లు చెబుతున్న 77 ఎకరాలతో పాటు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన మరో 54 ఎకరాలను కలిపి మొత్తం 308 ఎకరాలపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

తనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్తులతో పాటు తన ఆస్తులపైనా విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ధరణి, భూభారతి వ్యవస్థల్లో జరిగిన లావాదేవీలు, భూ వివాదాలపై కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు.

తనకు ఎన్నికల అఫిడవిట్‌, ఆదాయపు పన్ను రిటర్నుల్లో వెల్లడించిన ఆస్తులకు మించి అదనంగా ఒక్క గుంట భూమి కూడా లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తన ఆస్తులపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

నాదర్‌గుల్, పసుమాముల భూములపైనా ప్రశ్నలు

నాదర్‌గుల్‌లో భారీ విలువైన భూముల వ్యవహారంపై తాము గతంలో ఆధారాలతో ఆరోపణలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని హరీశ్‌రావు అన్నారు. సీఎం సోదరుడికి సంబంధించిన టెస్సరాక్ట్ కంపెనీకి భూముల కేటాయింపు, పసుమాములలో మరో సోదరుడికి సంబంధించిన భూముల నాలా కన్వర్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా భూభారతి వ్యవస్థలో యజమానులకు తెలియకుండానే వేలాది భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

22ఏ భూములపై శ్వేతపత్రం ఇవ్వాలి

నిషేధిత భూముల జాబితా అయిన 22ఏపై కూడా హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములను 22ఏ జాబితాలో చేర్చారు.. ఎన్ని భూములను ఆ జాబితా నుంచి తొలగించారనే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

భూముల రికార్డులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం, మంత్రుల మధ్య భిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో భూముల చేర్పులు, తొలగింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు.

రాజ్ బ్రీడర్స్ షేర్లపై వివరణ

తన బంధువులు 2019లో ‘రాజ్ బ్రీడర్స్’ అనే సంస్థకు సంబంధించిన షేర్లను చట్టబద్ధంగా బ్యాంకు లావాదేవీల ద్వారా కొనుగోలు చేశారని హరీశ్‌రావు వివరించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ కుటుంబ భూముల విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ప్రస్తావించారు. గతంలో కేసీఆర్‌కు భారీగా ఫామ్‌హౌస్ భూములు ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన రేవంత్.. ప్రస్తుతం వేరే సంఖ్యలను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.

మొత్తంగా రేవంత్‌రెడ్డి కుటుంబ భూములు, RRR–బుల్లెట్‌ ట్రైన్ అలైన్‌మెంట్లు, ధరణి–భూభారతి వ్యవహారాలు, 22ఏ భూములపై హరీశ్‌రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి వచ్చే అధికారిక వివరణ కీలకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here