తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. ఉగాది రోజున యాదాద్రికి వస్తున్నట్టుగా ప్రోగ్రామ్ మొదలయ్యే కేవలం 20 నిమిషాల ముందు గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, అలాంటి సమయంలో అప్పటికప్పుడు ప్రోటోకాల్ పాటించాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయని, దీనిని గవర్నర్ తమిళిసై అర్ధం చేసుకోవాలని కోరారు. ఒక ప్రభుత్వం గవర్నర్ కు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే, గవర్నర్ తమిళిసై రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అనంతరం.. తెలంగాణ ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందని, వ్యక్తిగతంగా తనను అవమానించినా పర్వాలేదని, కానీ రాజ్యాంగ పరమైన వ్యవస్థలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే దీనిని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నిన్న ఖండించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా వివక్ష చూపదని, గవర్నర్ తమిళిసై విషయంలో కూడా ప్రొటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంతకుముందు గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ ఎప్పుడూ ఇలా వ్యాఖ్యానించలేదని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ