తెలంగాణలోని కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఏప్రిల్ 9, గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా 2014లో కూడా పోటీ చేసినప్పటికీ బీఎస్సీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2018 ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ తో పాటుగా, పలువురు పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సమ్మయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.