తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో జూలై 7 వ తేదీ నుంచి పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. అయితే సోమవారం వరకు భవనాల కూల్చివేత పక్రియను నిలిపివేయాలని హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవనాల కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
గతంలో నూతన సచివాలయం నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, సచివాలయం కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా జూన్ 29 న తుది తీర్పు వెలువరించింది. నూతన సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంటూ, కూల్చివేతపై మంత్రివర్గ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేతలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లంటినీ కోర్టు కొట్టివేసింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. అయితే తాజా కోర్టు ఆదేశాలతో కూల్చివేత పనులు మరోసారి నిలిచిపోనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu