దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని గురువారం సాయంత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీలు పెట్టాలని, ఎక్కువమంది రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరూ పార్టీ పెట్టిన స్వాగతిస్తామని, పార్టీలు ఎప్పుడూ ప్రజలకు మేలు చేసేలా ఉండాలని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు బదులిస్తూ, 2007 లో పీఆర్పీ సమయం నుంచి రాజకీయాల్లో ఉన్నానని, కొత్తగా వచ్చింది కాదన్నారు.
తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఉన్న నేల అని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడిన యువత రావాలని కోరుకుంటున్నానని, అందుకోసం పార్టీ పరంగా వారిని గుర్తించి, తెలంగాణకు సంబంధించినంతవరకు మేలు జరిగేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యంగా మారుతుందన్నారు. వేలకోట్లతోటి ముడిపడివున్న ఈ రాజకీయ వ్యవస్థలో గత అనుభవాలు ఉన్నా కూడా ముందుకొచ్చి పార్టీ పెట్టానని, అయితే తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని చెప్పారు. అయితే ఒక దశాబ్దం పాటు కష్టపడి యువ రక్తాన్ని రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ