చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రశంసించారు. వర్షంలో తడుస్తూ ఒక దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తి గురించి సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆయనను రక్షించారు. ఆ వ్యక్తి తన వివరాలను ఏమీ చెప్పలేని పరిస్థితులలో ఉన్నప్పటికీ చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన బీ.మహేష్ అనే కానిస్టేబుల్, ఎం.డి సయీద్ అనే హోం గార్డ్ తో కలిసి ఆ వ్యక్తిని రక్షించేందుకు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న అతనిని 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న అతను ఏ వివరాలు చెప్పనప్పటికీ, తన పేరు శేఖర్ అని చెప్పగలిగాడని పోలీస్ సిబ్బంది తెలిపారు.
భారీ స్థాయిలో వర్షం పడుతున్నప్పటికీ పోలీస్ సిబ్బంది వెళ్లి ఆ వ్యక్తిని కాపాడినందుకు హోంశాఖ మంత్రి వారికి అభినందనలు తెలియజేశారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను కాపాడడంతో పాటు ఈ రకమైన సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu