హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. ముగ్గురిలో వైరస్ లక్షణాలు, గాంధీ ఆసుపత్రి చికిత్స

Hyderabad Three Suspected Ebola Patients Kept Under Strict Monitoring at Gandhi Hospital

భాగ్యనగరంలో ఎబోలా వైరస్ అనుమానిత లక్షణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అనుమానిత లక్షణాలతో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ తరహా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి మొత్తం సంఖ్య ముగ్గురికి చేరింది. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఎబోలా తరహా లక్షణాలతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిని ఆశ్రయించారు.

వారిని నిశితంగా పరిశీలించిన వైద్యులు, ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలా కావచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, పటిష్టమైన నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, నిన్ననే (గురువారం) శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మరో వ్యక్తిని కూడా ఇలాంటి జ్వర లక్షణాలతోనే గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఒక కీలకమైన విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు అనుమానితులు కూడా విదేశాల నుంచి ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు బాధితులు ఒకే విమానంలో ప్రయాణించారనే విషయం నిర్ధారణ కావడంతో వైద్య నిపుణులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

సదరు ఫ్లైట్‌లో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చేరిన ముగ్గురినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

వీరి నుంచి కీలకమైన రక్త నమూనాలను సేకరించి, తుది వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనూ, ఆసుపత్రుల్లోనూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాబట్టి ప్రజలు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here