హైదరాబాద్కు చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నేటి నుంచి (జనవరి 4, 2022) రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 సీరో సర్వేని ప్రారంభించనున్నారు. ఈ సర్వే సాధారణ జనాభా మరియు ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మరియు రాష్ట్రంలో వైరస్ యొక్క సామాజిక వ్యాప్తిని అంచనా వేయడమే లక్ష్యంగా ఈ సీరో సర్వే చేపట్టనున్నారు. జిల్లాల్లోని సాధారణ జనాభా మరియు హెల్త్ కేర్ వర్కర్స్ నుండి సేకరించే రక్త నమూనాలలో కోవిడ్-19, యాంటీబాడీలను పరిశీలించడం ద్వారా సీరో-ప్రివెలెన్స్ అంచనా వేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేకు మద్దతు ఇస్తుండగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ఇతర పరిపాలనా విభాగాలు ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ తో సహకరించనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోని 330 గ్రామాల్లో, పలు వార్డుల్లో ఇంటింటికి సర్వే చేయనున్నారు.
ఈ సర్వేలో దాదాపు 16,000 మంది జనాభాను కవర్ చేయనున్నారు. 33 జిల్లాల్లోని ప్రతి 10 గ్రామాలను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు మరియు ప్రతి గ్రామంలో నుండి 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 40 మంది వ్యక్తులను (స్త్రీ, పురుషులు) లను కవర్ చేయనున్నారు. ఇందుకు అదనంగా అన్ని జిల్లాల్లోని ఆరోగ్య కార్యకర్తల నుండి నమూనాలు మరియు డేటాను కూడా సేకరించనున్నట్టు సర్వేకు నాయకత్వం వహిస్తున్న ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ విభాగం సైంటిస్ట్,హెడ్ డా.అవుల లక్ష్మయ్య తెలిపారు. అలాగే ఎన్ఐఎన్ కు చెందిన ఒక శాస్త్రవేత్త/డాక్టర్, టెక్నీషియన్ మరియు ఫ్లేబోటోమిస్ట్, 4 కోఆర్డినేటర్లు, ఒక ప్రముఖ శాస్త్రవేత్తతో కూడిన 20కి పైగా బృందాలు రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పనిచేసి సుమారు 3 వారాల్లో ఈ సీరో సర్వేను పూర్తిచేయనున్నట్టు ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ