కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ గత నెల రోజులు పైగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం మాస్టర్ ప్లాన్ రద్దుకు ఆమోదించింది. శుక్రవారం జరిగిన మున్సిపల్ కార్యవర్గ అత్యవసర సమావేశంలో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దును కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు కోసమే ఈరోజు కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమైందని, అయితే ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదా తాము రూపొందించింది కాదని తెలిపారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నమూనాను రద్దు చేయాలని ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశామని, దీనికి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ఈ మేరకు తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనున్నట్టు ప్రకటించారు. ఇక గత 45 రోజులుగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల రైతులను ప్రతిపక్ష పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయని, రైతులెవరూ ఇకపై ఆందోళన చెందాల్సిన పనిలేదని జాహ్నవి స్పష్టం చేశారు.
కాగా తమ భూములను కోల్పోవడం ఇష్టంలేని రైతులు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను నిలుపుదల చేయాలని కోరుతూ.. జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్లతో పాటు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలన్న డెడ్ లైన్ కూడా విధించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఒత్తిడి మేరకు బీజేపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమిషనర్ కు పంపారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కూడా షబ్బీర్ అలీకి రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 8మంది రాజీనామాకూ షబ్బీర్అలీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ కౌన్సిలర్లపైనా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే నేడు సమావేశమైన మున్సిపల్ పాలక వర్గం మాస్టర్ ప్లాన్ రద్దుకు ఆమోదించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE