తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో విజయవంతంగా కొనసాగుతుంది. జనవరి19వ తేది నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుతుంది. కంటి వెలుగు రెండోవ దశను జనవరి 18న సీఎం కేసీఆర్ ఖమ్మం నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 19 నుండి స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. వైద్య శిబిరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలతో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
“ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. అందులో అవసరమైన వారికి 2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. 2018లో నిర్వహించిన కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో రాష్ట్రం అత్యుత్తమ ట్రాక్ రికార్డును సాధించింది, గత రికార్డును అధిగమించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1.57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వారంలో 5 రోజులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వైద్య బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి బృందంలో ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశా వర్కర్లు, ఒక కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు. ప్రతి వ్యక్తికి కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు” అని తెలిపారు.
“ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్ వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈఓ మరియు ఏఎన్ఎంలు ట్యాబ్ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. కంటి పరీక్షల తర్వాత అదే వైద్య శిబిరంలో అక్కడికక్కడే రీడింగ్ గ్లాసుల పంపిణీ చేస్తున్నారు. కంటి పరీక్షల నాణ్యతను నిర్ధారించడానికి ప్రతి జిల్లాకు నాణ్యత నియంత్రణ బృందాలు కూడా పరిశీలిస్తున్నాయి. 1500 వైద్య బృందాలతో 100 రోజుల కార్యక్రమంగా ఇది జరగనుంది. ఈ నెల జనవరి 19 నుండి జూన్ 15 వరకు 16,556 ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ల ఆద్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాలలో 12,768 వైద్య శిబిరాలు, పట్టణ ప్రాంతాలలో 3,788 వైద్య శిబిరాలు ఉన్నాయి. వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్ క్లబ్ ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాలలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE