రాష్ట్రాన్ని ప్రకటించిన పార్టీని కాదని ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్కే రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దాదాపు పదేళ్ల పోరాటం అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించిన నాటి నుంచీ కొంచెం కొంచెం పుంజుకుంటూ.. పడుతూ, లేస్తూ చివరకు అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్లో ఉన్న కాంగ్రెస్కు ఇప్పుడు సింగరేణి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వాస్తవానికి ఆ ఎన్నికలు కనీసం ఇంకో నెల రోజులు పొడిగిస్తే ఈలోపు మరింత బలపడాలని కాంగ్రెస్ భావించింది. కానీ.. కోర్టు తీర్పుతో ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
సింగరేణి ఎన్నికలు ఎందుకు ప్రతిష్ఠాత్మకం అంటే ప్రతిష్ఠాత్మకంగా వచ్చే ఏడాది మేలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం పాలపొంగు కాదని నిరూపించుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికంటే ముందు సింగరేణిలో గెలిచి.. విజయపరంపరను పార్లమెంటు వరకు కొనసాగించాలని హస్తం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ఐదు పార్లమెంటు స్థానాల పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లు ఉన్నాయి. వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్, పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
అలాగే ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆసిఫాబాద్, మహబూబాద్ పరిధిలో పినపాక, ఇల్లందు, ఖమ్మం పరిధిలో కొత్తగూడ, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్లో బీఆర్ఎస్, కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ గెలుపొందాయి. మిగతా 10 చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఐదు ఎంపీ స్థానాల్లో సింగరేణి ఓట్లే కీలకం కావటంతో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. ఆదిలాబాద్ మినహా మిగతా నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీకి అంతగా పట్టులేదు. బీఆర్ఎస్తో ముఖాముఖీ పోటీ జరిగే అవకాశం ఉండటంతో హస్తం నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టుల మద్దతు కోరుతున్నారు.
ఫిబ్రవరిలో జోడో యాత్రలో భాగంగా సింగరేణి ఏరియాలో కూడా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అలాగే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర సైతం సింగరేణి ఎక్కువ శాతం కవర్ చేసింది. దీంతో సింగరేణిపై రేవంత్కు పూర్తి అవగాహన ఉంది. సింగరేణిలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పట్టు సాధించాలని ఇటీవలే ఐఎన్టీయూసీ నేతల సమావేశంలో దిశనిర్దేశం చేశారు. కోల్బెల్ట్ ఏరియాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్బాబు పర్యవేక్షణలో ఐఎన్టీయూసీ సింగరేణి ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేస్తోంది. మొత్తానికి కాంగ్రెస్కు సింగరేణి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.
మరోవైపు.. సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మొదట్లో మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించటంతో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీంతో దిగివచ్చిన బీఆర్ఎస్… ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఎమ్మెల్సీ కవితతో ప్రకటన చేయించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ప్రచారం ఉంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE