హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 3, సోమవారం నాడు బయోడైవర్సిటీ కూడలి వద్ద డబుల్ హైట్ ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన మోహిదీపపట్నం, రాయదుర్గం ప్రాంతాల నుంచి హైటెక్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయాలు తొలిగిపోనున్నాయి. బల్దియా పరిధిలో ఎస్ఆర్డీపీ పనుల కింద నిర్మించిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్ ఫ్లైఓవర్ నగరంలోనే ఎత్తయినదిగా గుర్తింపు పొందింది.
ఎస్ఆర్డీపీలో భాగంగా 69.47 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను నిర్మించింది. పనుల ప్రారంభమైన రెండున్నర సంవత్సరాల తరువాత ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు గచ్చిబౌలి ప్రాంతంలో మరో రెండు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ నిర్మాణానికి కూడ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వీటిని రూ.330 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]