తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగిసిపోనుండటంతో.. ప్రచారం హీట్ మరింత పెరిగింది. జోరుగా ప్రచారాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న నేతలకు మరోవైపు ఓట్ల చీలికపై లెక్కలు కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి.
మరో 5 రోజుల్లో పోలింగ్.. 8 రోజుల్లో ఫలితాలు వెలువడనుండటంతో కీలకమైన ఓట్లను ఎలా సాధించాలా అని అభ్యర్థులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. తాము విజయం సాధించడానికి ప్రతీ ఓటర్, ప్రతి ఓటూ కీలకమే కాబట్టి ఏ ఒక్క ఓటును వదులుకోవడానికి అభ్యర్ధులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సీన్లు కూడా ఉండటంతో ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ప్రతీ అభ్యర్థి ఆశిస్తారు.. కానీ, ఇప్పుడా కోరిక తీరేటట్టు కనిపించకపోవడంతో నేతల్లో గుబులు మొదలయింది.
సాధారణంగా ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంకు ఎప్పుడూ కూడా కొంత ఉంటుంది. వీళ్లెప్పుడు కూడా అభ్యర్థి ఎవరైనా సరే.. ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తూ ఉంటారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తల నుంచి సానుభూతిపరుల వరకు ఈ కేటగిరీలోకే వస్తారు. వీరి ఓట్లు ఎప్పుడూ వేరే వారికి పడవు. కానీ కొంతమంది అక్కడ సమస్యలు, పరిస్థితులను బట్టి, అభ్యర్దులను బట్టి ఓట్లు వేస్తుంటారు. వీళ్లే అభ్యర్థుల గెలుపోటముల్ని డిసైడ్ చేయటంలో కీలకంగా మారతారు. అందుకే నేతలంతా వీరిని ప్రసన్నం చేసుకోవటానికి తంటాలు పడుతుంటారు.
ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అయితే ఈ మూడు పార్టీలకు తోడు కొన్ని చిన్నపార్టీలతో పాటు చాలామంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థులంతా చాలా ఓట్లను చీలుస్తారు. ఇప్పుడు ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరికి పడాల్సినవి? ఓట్ల చీలికతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. బరిలో దిగిన అభ్యర్థులలో ఎవరు తమ ఓట్లను చీలుస్తారనే లెక్కలతో పార్టీ పెద్దలు పరేషాన్ అవుతున్నారు.
ఇప్పుడు తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బర్రెలక్క ఓ సంచలనంగా మారింది. గ్రాడ్యుయేట్ అయిన శిరీష చిన్న వీడియోతో బర్రెలక్కగా మారి సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లను సంపాదించుకుంది. సోషల్ మీడియాని దాటి ఏకంగా ఎన్నికల బరిలో నిలబడేసరికి చాలామంది నవ్వుకున్నారు. కానీ, కేవలం పది రోజుల్లోనే ఆమెపై ఉన్న అంచనాలు మారిపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.
ముఖ్యంగా బర్రెలక్క వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఓట్లు చీలిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెకు మద్దతు తెలుపుతున్నవారిలో యూత్ ఎక్కువ మంది ఉండటంతో, బీఆర్ఎస్ ఓట్లు కూడా చీలిపోయే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నామినేషన్లకు ముందు వరకు జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య పోరుగా భావించిన వారంతా.. బర్రెలక్క ఎంట్రీతో రాజకీయ లెక్కలు మారిపోయినట్లు భావిస్తున్నారు.
బర్రెలక్కతో పాటు, ఇతర నియోజకవర్గాల్లోనూ కొంతమంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయిదుగురు స్వతంత్రులుగానో, చిన్నపార్టీల అభ్యర్థులుగానో పోటీ చేస్తున్నారు. దీంతో ఓట్లలో చీలిక తప్పదని తేలడంతో.. బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పర్వాలేదు కానీ .. 119 స్థానాల్లో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపించడంతో నేతల్లో కొత్త టెన్షన్ మొదలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE