తెలంగాణలో పోలింగ్కు సరిగ్గా ఐదు రోజులు.. ప్రచారానికి మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ కీలక సమయంలో ఎన్నికల సంఘం అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ ఇచ్చింది. రైతు బంధు నిధులు పంపిణీ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు తెగ సంబరపడిపోయారు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ కూడా ఉంది. బీఆర్ఎస్కు ఈసీ గుడ్ న్యూస్ చెప్పినట్లే చెప్పి.. ఇరుకున పెట్టిందా..? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రైతు బంధు నిధుల పంపిణీకి షరతులు విధించడమే..
రెండో విడత రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ.. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కానీ ఇన్నిరోజులు స్పందించని ఈసీ.. సరిగ్గా ఎన్నికలకు ఐదు రోజుల ముందు శుక్రవారం రాత్రి అనుమతి ఇచ్చింది. 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరుసటి రోజు సైలెన్స్ పీరియడ్ కాగా.. ఆ మరునాడే పోలింగ్ జరగనుంది. దీంతో 28 తేదీలోగానే రైతుల ఖాతాలో రైతు బంధు నగదును జమ చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
కానీ ఇక్కడే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎందుకంటే 24వ తేదీన రాత్రి రైతుబంధు నిధులు పంపిణీ చేసేందుకు ఈసీ అనుమతిచ్చింది. ఈరోజు డబ్బులు జమ చేసేందుకు అవకాశం లేదు. ఈ మరునాడే అంటే 25న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. అలాగే 26న ఆదివారం.. 27న గురునానక్ జయంతి కావడంతో ఆ రెండు రోజులు కూడా బ్యాంకులు క్లోజ్ ఉండనున్నాయి. ఇక మిగిలింది 28వ తేదీ ఒకే ఒక్కరోజు. ఆ ఒక్కరోజే రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది.
కానీ ఒకే ఒక్క రోజు దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? లేదా? అనేది చర్చనీయాశంగా మారింది. ఆ ఒక్కరోజు చెయ్యలేకపోతే.. ఇక బీఆర్ఎస్ సర్కార్కు మరో అవకాశం లేదు. ఎందుకంటే మూడో తేదీ తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో చెప్పలేము. అందుకే ఎన్నికల సంఘం బీఆర్ఎస్ సర్కార్కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇరుకున పెట్టిందనే చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE