తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కదనరంగంలో ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. రైతు బంధు నిధులు పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బీఆర్ఎస్ సర్కార్ రైతుబంధు పథకం కింద ప్రతి ఏడాది ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. రెండు విడతలుగా ఈ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తోంది. అయితే ఇప్పటికే ఓ విడత డబ్బులు జమ చేయగా.. ఇప్పుడు రెండో విడత డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో రైతు బంధు డబ్బులు రైతుల ఖతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రైతుబంధు పథకం కొన్నేళ్లుగా కొనసాగుతోందని.. రెండో విడత నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని బీఆర్ఎస్ సర్కార్ కోరింది.
పోయిన నెలలో ఎన్నికల సంఘానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయగా.. తాజాగా ఈసీ దీనిపై నిర్ణయం తీసుకుంది. యాసంగి పంటకు సంబంధించి రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈనెల 28న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. అలాగే 30న పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో 28 సాయంత్రం నుంచి 30న పోలింగ్ ముగిసే వరకు నిధుల్ని రైతుల ఖతాలో జమ చేయొద్దని ఈసీ సర్కార్ను ఆదేశించింది. ఆలోపే నిధుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించింది. ఈక్రమంలో 28న కంటే ముందే రైతుల ఖతాలో డబ్బు జమ చేసేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖతాల్లో నగదు జమ చేయనుంది.
అయితే కొద్దిరోజులుగా రైతుబంధు అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతు బంధు నిధుల విడుదల ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘానికి కూడా దీనిపై లేఖ రాసిందని పలుమార్లు బీఆర్ఎస్ పాలకులు చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం.. బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేఖ దొంగ సాకులు చెబుతోందని రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయితే ఏది ఏమయినప్పటికీ రైతుబంధు నిధుల విడుదలపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE