తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం కలచివేస్తోందని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. “కైకాల సత్యనారాయణ తెలుగు సినీ రంగానికే కాదు. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. సత్యనారాయణ పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు. కైకాల సత్యనారాయణతో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.” అని చిరంజీవి అన్నారు.
“నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యనారాయణకి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యనారాయణ గారు సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు” అని అన్నప్పుడు మీరు త్వరగా కోలుకోండి. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడిపోయారు. కైకాల సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE