తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం నాడు తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాలలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన కార్యక్రమాలపై, కరోనా నియంత్రణపై వారికి దిశా నిర్దేశం చేశారు.
కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి:
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ “కరోనా మొదటి వేవ్ లో ఫ్రంట్ వారియర్స్ గా మీరంతా కష్టపడి కరోనాని చాలా వరకు కట్టడి చేశారు. మీ అందరికీ పేరు పేరునా అభినందనలు. ఈ వేసవిలో కరోనా తీవ్రత కాస్త తక్కువ వున్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూడాలి. మాస్క్ లు ధరించని వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెయ్యి రూపాయల జరిమానా వేయాలి. ఈ కఠిన సమయంలో మనమందరం ప్రజలకు మరింత సేవ చేయాలి. వ్యాక్సిన్ వేయించుకోని వారంతా తప్పనిసరిగా వేయించుకోవాలి. 45 ఏండ్లు దాటిన వారందరూ వాక్సిన్ వేయించుకునేలా చూడాలి. కాబట్టి స్టాఫ్ అంతా కూడా మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ సామాజిక, భౌతిక దూరం పాటించేలా చూడాలి. స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలి. గత ఏడాదిలాగే ఈసారి కూడా డ్వాక్రా సంఘాలు మాస్కులు తయారు చేసేలా ప్రోత్సహించాలి. అన్ని బహిరంగ ప్రదేశాలలో సోడియం హైపోక్లోరైడ్ తో శానిటేషన్ చేయాలి” అని చెప్పారు.
“గ్రామాల్లో దోమలు పెరగకుండా ప్రత్యేక శ్రద్ధతో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. అలాగే గ్రామాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలి. త్రాగునీరు అందించే ఓహెఛ్ఎస్ఆర్, బోరింగులు, బావులు మరియు పైప్ లైన్లు, పబ్లిక్ నల్లాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలి. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ళలో ప్రయాణికుల కోసం చలి వేంద్రాలు పెట్టాలి. వీధులను రోజూ ఊడవాలి. శానిటేషన్ చేయాలి. తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. ఉపాధి హామీ కూలీలకు వారు పని చేసే చోట్ల నీడ మరియు త్రాగు నీరు ఏర్పాటు చేయాలి. ప్రైమరి హెల్త్ సెంటర్ల నుండి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెచ్చి, ఉపాధి హామీ పని స్థలాలలో పెట్టాలి. ఉపాధి హామీ పనులు పొద్దున మాత్రమే జరిగేలా శ్రమ శక్తి సంఘాలతో కలిసి షెడ్యూలు చేసుకోవాలి. మధ్యాహ్నం పని చేయించకూడదు. పశువులు, మూగ జీవాలకు నీటితొట్లు, నీటి గుంటల ద్వారా వాటి దాహం తీర్చి కాపాడాలి. ‘వడదెబ్బ’పై అవగాహన కల్పించి, ప్రజల అనవసర ప్రయాణాలు మాన్పించాలి. మొక్కలకు నీరు పోస్తూ వాటిని సంరక్షించాలి. నర్సరీలలోని మొలకలకు సరైన నీడ, నీరు అందిస్తూ వాటిని కాపాడాలి. వర్షాకాలం మొదలవగానే ప్లాంటేషన్ చేపట్టేలా, నర్సరీలను సిద్ధం చేసుకోవాలి. పల్లె ప్రకృతి వనాల మెయింటెనెన్స్ పై కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో, పల్లె ప్రకృతి వనాలలో క్రమంతప్పకుండా చెట్లకు నీటిని పోయాలి” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్పంచ్లు, అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, గ్రామ కార్యదర్శులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ