తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడంవల్లనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ మార్గనిర్ధేశకాల ప్రకారమే వీరందరికీ చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ విడుదల చేసిందని వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనుందని ప్రకటించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) నూతన మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని తెలిపింది. ఒక వేళ లక్షణాలు ఎక్కువ ఉన్న, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాదపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిచాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది.
హోమ్ ఐసోలేషన్ కొరకు మే 10 వ తేదీన విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్ ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ మార్గ నిర్ధేశాలు విడుదల చేసింది. ఇంట్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సహాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందిస్తున్న వ్యక్తి కి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ అందించాలని సూచించింది. 17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని ఐసీఎంఆర్ తెలిపింది. ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీంలు పరీక్షలు చేస్తారని, వారికి అవసరం అయిన నిత్యావసరవస్తువులు అన్నీ జీహెఛ్ఎంసీ ద్వారా అందిస్తామని మంత్రి తెలియజేశారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడేల్ ఆఫీసర్ కూడా నియమించామన్నారు.
కోవిడ్ మరణాల విషయంలో కూడా ఐసీఎంఆర్ నూతన మార్గానిర్దేశకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దీర్ఘ కాలిక వ్యాదులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయి. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu