దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ఆలయ పూజారులు కల్యాణ క్రతువులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడిచే మాంగళ్యధారణ చేయించారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక వేద పండితులు సీతారామ కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు స్వామివారి కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కాగా హిందూ క్యాలెండర్ ప్రకారం, రామ నవమి చైత్ర మాసంలో తొమ్మిదవ రోజు వస్తుంది. ఇది చైత్ర నవరాత్రుల చివరి రోజు కూడా అయినందున శ్రీ రామ నవమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
ఇక శ్రీరామ నవమి ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకలకు దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ పొట్లాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు లక్షల లడ్డూలు, 100 టన్నుల తలంబ్రాలు సిద్ధం చేశామని, వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 కౌంటర్ల ద్వారా ప్రసాదం విక్రయిస్తామని, 70 కౌంటర్ల ద్వారా తలంబ్రాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి భద్రాచలానికి టీఎస్ ఆర్టీసీ మరియు ఏపీఎస్ ఆర్టీసీలు అనేక బస్సులను నడుపుతున్నాయి. ఈ సందర్భంగా ఎండోమెంట్ కమీషనర్ అనిల్ కుమార్, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డి అనుదీప్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి వినీల్ తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE