రవీంద్రభారతిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు 126 మందికి 5 లక్షలు, శాశ్వత వైకల్యం పొందినవారికి 147 మందికి 5 లక్షలు, మరియు తాత్కాలిక అంగ వైకల్యం పొందినవారికి 315 మందికి 10 వేల రూపాయలను మొత్తం 588 మంది లబ్ధిదారులకు 13.96 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియోను గీత వృత్తి దారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ల ఆత్మగౌరవం కాపాడటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లు తెరుస్తామన్నారు. లక్షలు సంపాదించకున్నా, ఆత్మ గౌరవంతో బతికే వారు కల్లు గీత వృత్తిదారులన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఇతర కులస్తులు కల్లు గీయకుండా కేవలం గౌడలే వృత్తిని చేపట్టేలా ప్రత్యేక జీవో తెచ్చామన్నారు. త్వరలో గౌడలకు మంచి డిజైన్ తో కూడిన వెహికల్స్ అందిస్తామన్నారు. త్వరలో హైదరాబాద్ కోకాపేటలో గౌడ కులస్థుల కోసం సైతం 5 కోట్ల నిధులతో గౌడ భవన్ కట్టుకుంటామన్నారు. గౌడలు గౌరవప్రదంగా బ్రతికేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తల్లీదండ్రులు చనిపోయిన గీత కార్మికుల పిల్లలను ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకొనే వెసులు బాటు కల్పిస్తామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటలకు సంరక్షణ చర్యలు చేపట్టి వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తాటి, ఈత వనాలను ప్రతి గ్రామంలో పెంచుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. గౌడ్ ల కోసం రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని, హరితహారంలో భాగంగా 3.80 కోట్ల తాటి, ఈత మొక్కలను పెట్టి కులవృత్తిని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాంకేతికంగా నిరూపణ జరిగిందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ లో కల్లు కాంపౌండ్లు మూశారు. మాట తప్పకుండా కల్లు కాంపౌండ్లు ఓపెన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. గౌడ్లు, యాదవ్ లు ఆత్మగౌరవంతో బతికేవారు. గౌడ సామాజిక వర్గం, వారి సంక్షేమంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంపూర్ణ అవగాహన ఉంది. గౌడ సంఘాలన్నీ ఏకతాటిపై ఉండాలి. అలాగే నీరా స్కీం సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, బీసీ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, స్టేట్ ఫైనాన్స్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ