కరోనా బాధితులకు అత్యంత అనుకూలంగా, అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ వాహనాలను తీర్చిదిద్దామని, ఈ వాహనాలు కరోనా బాధితులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 14 అంబులెన్స్ వాహనాలకు పలువురు దాతలు విరాళాలు ఇవ్వగా, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మంత్రి కేటిఆర్ కి అందచేశారు. ఆ నిధులతో ప్రస్తుతం బుధవారం 10వాహనాలను సిద్ధం చేశారు. ఆ 10 అంబులెన్స్ వాహనాలను మంత్రి కేటిఆర్ ప్రగతి భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, డబ్బులు అందరూ సంపాదిస్తారని, వాటిని ఖర్చు చేసే పద్ధతిలోనే సంపాదించే వారి గొప్పతనం ఉంటుందని అన్నారు. అన్నింటికంటే దాన గుణం గొప్పదన్నారు. తాను ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కి స్పందించి అనేక మంది విరాళాలు అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు. అలాగే ఈ వాహనాలను అందే విధంగా చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలను కేటిఆర్ అభినందించారు. కాగా ఈ వాహనాలను ప్రస్తుత కరోనా సమయంలోనే గాక, ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. అయితే, కరోనా బాధితుల్లో సీరియస్ గా ఉన్న వారికి తమ తమ ప్రాంతాల నుంచి సమీప పెద్ద దవాఖానాకు వెళ్ళే సమయంలో కీలకమైన వైద్య సహాయం ఈ వాహనాల ద్వారా అందుతుందన్నారు. ఈ అంబులెన్స్ వాహనాల్లో ఆక్సీజన్, వెంటిలేటర్లు ఉండటం వల్ల క్రిటికల్ కండీషన్ లో ఉన్న పేషంట్ల ప్రాణాలు కాపాడడానికి వీలవుతుందన్నారు.
పాలకుర్తి కి వద్దిరాజు రవిచంద్ర, తొర్రూరుకు సంతోష్ రెడ్డిలు 2 వాహనాలును, వర్ధన్నపేటకి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వెంకటేశ్వర గ్రానైట్స్ ఆర్.వెంకటేశ్వరరావులు 2 వాహనాలను, ములుగుకు లక్ష్మణ్ రావు, భూపాలపల్లికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, పరకాలకు చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు నకు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్, జనగామకు గుండా ప్రకాశ్ రావులు విరాళాలు అందించారు. కాగా కేటిఆర్ పిలుపునకు స్పందించి, తాము అడిగిన వెంటనే ఆలోచించకుండా ప్రజలకు ఉపయోగపడే ఈ అంబులెన్స్ వాహనాల కోసం మానవీయ దృక్పథంతో విరాళాలు అందించిన దాతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు పేరునా అభినందించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu