భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ద్రౌపది ముర్ము 50 శాతం మార్కును దాటడంతో ఆమె విజయం ఖరారైంది. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 64.03 శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకు రాగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో దేశ రాష్ట్రపతి పీఠం అధిరోహిస్తున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు.
దేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జూలై 18న జరిగిన పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలతో కలిపి 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా ఎంపీ ఓట్లను లెక్కించగా పోలైన మొత్తం 763 ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయని, 15ఓట్లు చెల్లలేదని తెలిపారు. అనంతరం అక్షర క్రమంలో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను వరుసగా లెక్కించారు. కౌంటింగ్ పూర్తి అయిన అనంతరం ద్రౌపదిముర్ముకు మొత్తం 2824 ఓట్లు (6,76,803 ఓట్ల విలువ), యశ్వంత్ సిన్హాకు మొత్తం 1877 ఓట్లు (3,80,177 ఓట్ల విలువ) వచ్చాయని తెలిపారు. 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లలేదని పేర్కొన్నారు. దీంతో ద్రౌపది ముర్ము ఓట్ల విలువ 6,76,803, యశ్వంత్ సిన్హా ఓట్ల విలువ 3,80,177 గా ఉండడంతో, అత్యధిక ఓట్ల విలువతో నిలిచిన ద్రౌపది ముర్ము దేశ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మీడియాకు అధికారికంగా వెల్లడించారు. అనంతరం పీసీ మోదీ ద్రౌపది ముర్ము నివాసానికి చేరుకుని రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా, సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనంతరం బీజేపీ తరఫున విజయం సాధించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముందునుంచి అంతా అనుకున్నట్లుగానే ద్రౌపది ముర్ము దేశ రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఒడిశాలోని ఆమె స్వస్థలమైన ఉపేర్బేడా గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ పథ్ వరకు ఢిల్లీ బీజేపీ నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ రోడ్ షో జరుగుతుంది. బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగుడి సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే దేశంలోని లక్షకుపైగా గిరిజన గ్రామాలతో పాటుగా, ద్రౌపది ముర్ము విజయాన్ని దేశవ్యాప్తంగా సెలెబ్రేట్ చేసుకునేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది.
ద్రౌపది ముర్ము నేపథ్యం:
ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు. ద్రౌపది ముర్ము తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక భువనేశ్వర్లోని సచివాలయంలో క్లర్క్ గా మరియు నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయురాలిగా, గౌరవ అసిస్టెంట్ టీచర్ గా కూడా పనిచేశారు. 1997లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా రాజకీయప్రవేశం చేశారు. ముందుగా రాయ్రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్ గా ఆమె ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఒడిశా 2000 అసెంబ్లీ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బిజూజనతాదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2002-02 వరకు వాణిజ్యం, రవాణా మరియు 2002-04 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాయరంగ్పూర్ నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు. ఇక రాష్ట్ర బీజేపీలో మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, అలాగే బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ స్థాయిల్లో ఆమె సేవలు అందించారు. అనంతరం మే 18, 2015 నుంచి జూలై 12, 2021 వరకు ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. తాజాగా బీజేపీ తరపున 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY