హైదరాబాద్ లోని జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ప్రజలకు ఆటంకం కలిగించడమే కాకుండా, నగర అందాన్ని కూడా కూడా చెడగొట్టడం జరుగుతుందన్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందని, రూ.10 కోట్లతో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన కనస్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను జీడిమెట్లలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే సంక్రాతి సమయానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పతుల్ గూడాలో మరో ప్లాంట్ కూడా ప్రారంభం కానుందని చెప్పారు.
ఇసుక, కంకరను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ ప్లాంట్ నిర్మాణం జరిగిందని, దీని ద్వారా గంటకు 50 టన్నుల నిర్మాణ వ్యర్థాలను వేరు చేయొచ్చని చెప్పారు. ఇసుక, కంకర, ఇటుకను పునర్వినియోగ వస్తువుగా మార్చడంతో తిరిగి వాటిని భవన నిర్మాణంలో వాడుకోవచ్చని అన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్ధాలు రోజుకు రెండువేల టన్నుల వరకు వస్తున్నట్టు అంచనా ఉందని, దీంతో మరొక రెండు ప్లాంట్స్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి భవన నిర్మాణ వ్యర్ధాలు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తునట్టు మంత్రి కేటిఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ