తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో రూ.40 కోట్లతో నిర్మించిన కుడివైపు అండర్ పాస్ ను మరియు రూ.29 కోట్లతో నిర్మించిన బైరామల్ గూడ ఎడమవైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ అండర్ పాస్, ఫ్లైఓవర్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి విషయంలో ఇతర పార్టీల నేతలు కూడా కలిసి రావాలి:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇప్పటికే ప్రారంభమైన ఫ్లైఓవర్స్, అండర్ పాస్ ల వివరాలను తెలియజేశారు. ఒక్క ఎల్బీనగర్ నియోజవర్గంలోనే రూ.672 కోట్లతో ఫ్లైఓవర్స్, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టామన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ ఇలా నగరానికి నలువైపులా పెద్దస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో గడ్డి అన్నారంలో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ఇతర పార్టీల నేతలు కూడా కలిసి రావాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి చేసింది వాళ్ళు చెప్పుకోవచ్చని, ప్రజలు నచ్చిన వారికీ మళ్ళీ అవకాశం ఇస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు కేంద్రం వరద సాయం చేయలేదని, ఇతర ప్రాజెక్టుల కోసం కూడా కలిపి, ఇక్కడ గెలిచిన బీజేపీ కార్పోరేటర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి పదివేల కోట్ల నిధులు అయినా రాష్ట్రానికి మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. నిధులు మంజూరు చేయిస్తే కేంద్రమంత్రికి నగరంలో పౌర సన్మానం చేస్తామని, అభినందనలు తెలుపుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ