తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీన మొదలవగా, మార్చ్ 4 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 26, బుధవారం నాడు జనగామ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. జనగామ పట్టణంలో కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించి, పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకంచ బస్తీలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
అనంతరం బస్తీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణ ప్రగతిలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. పట్టణంలో అవసరాల దృష్ట్యా మరికొన్ని స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ తో పాటుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు.
[subscribe]