కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘటనలు, తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు. అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి సోనియా గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనలను ఖండించారు. అలాగే ఈ పరిస్థితులు తీవ్ర బాధను కలిగిస్తున్నాయని అన్నారు. ఈ ఆందోళనల్లో మూడు రోజుల్లోనే 20 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఘర్షణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
ఈ స్థాయిలో అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏం చేస్తున్నారని సోనియా గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ విధమైన ఘర్షణలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని ఆమె ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలని, అల్లర్లను నియంత్రించేందుకు తగినంత భద్రతా దళాలను తక్షణమే మోహరించి చర్యలు తీసుకోవాలన్నారు. గత 72 గంటలుగా ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలను మోహరించి, పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వాల నిఘా వైఫల్యం వలనే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సోనియాగాంధీ విమర్శించారు.
[subscribe]