వరద సహాయక పునరావాస చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవారం నాడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి లతో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో వరద సహాయక చర్యలను మంత్రి సమీక్షించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, గత పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాల వలన జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 37 వేల కుటుంబాలు వరద ముంపుకు గురయ్యాయి. వరద సహాయంగా రూ.1350 కోట్లు ఇవ్వాలని ప్రధాన మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంప్రదిస్తున్నారని, కేంద్రం నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. వరదల వలన నగరంలో రూ. 670 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, నాలాలు ఇతర ఆస్తులకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. వరద సహాయక పనులపై రూ. 60 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం ఇప్పుడు నమోదైంది:
హైదరాబాద్ నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం ఇప్పుడు నమోదైందని మంత్రి కేటిఆర్ అన్నారు. 1908 సెప్టెంబర్ 28న సింగిల్ డేలో 43 సెంటిమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైంది. 1916 లో 140 సెంటిమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరం వార్షిక సగటు వర్షపాతం 77.9 సెంటిమీటర్లు కాగా 2020 లో ఇప్పటికే 120 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని అన్నారు. “ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడుతున్నందున రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా 32 సెంటిమీటర్ల వర్షపాతం ఒకేరోజు నమోదైంది. కుములోనింబస్ మేఘాల వలన ఆకాశం చిల్లుపడినట్లు కుండపోతగా వర్షం పడుతుంది. రాబోయే మూడు రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రాణ నష్టాన్ని నివారించుటకు అన్ని చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించుటకు జీహెచ్ఎంసీ అవగాహన కల్పిస్తున్నది. శిథిల, ప్రమాదకర, నీళ్లు నిలిచిన ఇళ్లను ఖాళీ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము” అని మంత్రి కేటిఆర్ అన్నారు.
సి.ఎం రిలీఫ్ కిట్లో రూ.2,800/- విలువైన నిత్యావసర వస్తువులు, 3 బ్లాంకెట్లు:
“వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, సహాయ, పునరావాస చర్యలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ సహాయ పునరావాస పనులలో జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ, రెవెన్యూ, పోలీసు, డి.ఆర్.ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వేల మందిని సహాయ కేంద్రాలకు తరలించడం జరిగింది. సహాయ పునరావాస కేంద్రాల్లో ఉచిత భోజన వసతి కల్పించాం. పునరావాస కేంద్రాల్లో మరుగుదొడ్డి సదుపాయం ఉన్నది. అలాగే దుప్పట్లు కూడా అందజేస్తున్నాం. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నాం. వరద ముంపు ప్రభావానికి గురైన 37 వేల కుటుంబాలకు సి.ఎం రిలీఫ్ కిట్లను అందిస్తున్నాం. ప్రతి సి.ఎం రిలీఫ్ కిట్లో రూ. 2,800/- విలువైన నిత్యావసర వస్తువులు, 3 బ్లాంకెట్లు అందిస్తున్నాం. వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకై స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాం. అలాగే క్రిమీసంహారకాలను స్ప్రే చేస్తున్నాం. భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగిస్తున్నాం. వరదల వలన దురదృష్టవశాత్తు జీహెచ్ఎంసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 33 మంది మృతి చెందారు. వారిలో 29 మందికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేసియా గా ప్రభుత్వం అందజేసింది” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu