ఈ విజయంతో మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేశామని పేర్కొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ గెలుపులో భాగంగా పని చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ఇక రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనేందుకు మునుగోడు ఉప ఎన్నికే నిదర్శన పేర్కొన్న మంత్రి కేటీఆర్.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలనే సోయి లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చివేయడంతో పాటు తెలంగాణలోనూ క్రూరమైన రాజకీయ క్రీడకు బీజేపీ పార్టీ తెరలేపిందని, అయితే మునుగోడు ప్రజలు వారి కుట్రలను తిప్పి కొట్టారని ప్రశంసించారు. అధికారం, అహంకారంతో బీజేపీ ఢిల్లీ పెద్దలు ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దారని, అయితే వారికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు అని అన్నారు. ఇక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావుకు హృదయపూర్వక ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని కేటీఆర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తమ అనుచరులతో డబ్బు పంపిణీకి ప్రయత్నించి కోట్ల రూపాయలతో దొరికిపోయారని, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మౌనుగోడు ఓటర్లను ప్రలోభపెట్టాలని చూసినా, ప్రజలు ఆయనను తిరస్కరించారని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అసాధారణ పరిస్థితిని సృష్టించి గెలవాలనుకుందని, లేదంటే టీఆర్ఎస్ అభ్యర్ధి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుపొందేవారని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలకు చేసిన మేలుని ప్రజలు గుర్తించారని, కనుకే టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE