ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.45 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ‘టీఎస్బీఐఈ ఎం–సర్వీసెస్’ యాప్ ద్వారా ముందుగానే పరీక్షా కేంద్రాల వివరాల తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను నియమించారు.
ఈసారి తెలంగాణలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,80,516 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,85,323 మందితో మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే పరీక్షల నిర్వహణలో 25,550 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు హాజరవుతున్న లక్షలాది మంది యువ విద్యార్థులకు నా శుభాకాంక్షలు. పరీక్షలు, మార్కులు ముఖ్యమైనవి అయితే జీవితంలో ప్రతిదీ వాటితోనే ఆగిపోదు. అందువలన ఒత్తిడికి గురికాకుండా, మీ వంతు కృషి చేయండని” కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించని నిబంధనను సడలించినట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కొన్ని నిముషాలు ఆలస్యంగా వచ్చిన అక్కడి పరిస్థితులను బట్టి అనుమతిస్తామని, మరి ఎక్కువ ఆలస్యంగా వస్తే కారణాలను బట్టి పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈసారి ఏపీలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,46,368 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,18,788 మందితో మొత్తం 10,65,156 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని, మంచి ప్రణాళికతో కష్టపడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.
My best wishes to the lakhs of young students who are appearing for their Intermediate board (10+2) examinations starting today
While exams & grades are important, they are NOT everything in life. Don’t stress, Do your best 👍
— KTR (@KTRTRS) March 4, 2020
Best of luck to all the students appearing for the Intermediate exams. I urge my young friends to write the exams stress-free and without pressure of any kind. Hard work & preparation will help you ace through them.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2020
[subscribe]