హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయానికి చేరువలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం నాడు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణంపై మంత్రులు ఇఎన్సీ గణపతి రెడ్డిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే పలు కీలక సూచనలు, సలహాలిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మహోన్నత ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, మహనీయులు అంబేద్కర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. దళితబంధు, రైతుబంధు పథకాలు మహత్తరమైనవి, ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దాదాపు అన్ని మంచి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు.
అంబేద్కర్ 125 అడుగుల కాంస్యవిగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తాం:
“నగరం నడిబొడ్డున సచివాలయం సమీపాన పీవీ మార్గ్లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తాం. ఈ కాంస్య విగ్రహాన్ని 11ఎకరాలలో రూ.150 కోట్లతో గొప్పగా నిర్మిస్తున్నాం. మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 8 నెలలుగా విగ్రహ ఏర్పాటు పనులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు, రాత్రిబవళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటిలో అతి పెద్దది. ఇది దేశానికే తలమానికంగా నిలవనున్నది. ఇందులో మ్యూజియం, గ్రంథాలయం, ఫోటో గ్యాలరీ, ధ్యాన మందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్ ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించనున్నారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుడు కలలుగన్నట్టు తెలంగాణలో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుంది” అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రుల వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, కాలే యాదయ్య, దివాకర్ రావు, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి, బి.సి.కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు మహ్మద్ సలీం, రావుల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ