దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంకు ముందు వృద్ధులు, వితంతువులకు 200, వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు అందించే ఆర్ధిక సహాయాన్ని 2016 రూపాయలకు, వికలాంగులకు అందించే ఆర్ధిక సహాయాన్ని 3016 రూపాయల కు పెంచడం జరిగిందని వివరించారు.
ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం నూతనంగా పెన్షన్ లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు 77,695 నూతన పెన్షన్ లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని పెంచిన తర్వాత లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు అక్కడా ఇక్కడా తిరిగే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు సీఎం అండగా నిలుస్తున్నారని అన్నారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా బతకాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.
వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ లకు వెళ్ళి ఆర్ధిక ఇబ్బందులు పడొద్దని, ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా నిర్వహించబడతాయని చెప్పారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా బస్తీ దవాఖానాలను మీకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందని, ఆక్కడ కూడా అవసరమైన ప్రభుత్వ వైద్య సేవలు పొందాలని చెప్పారు. కరోనా చికిత్సకు కేరాఫ్ గా గాంధీ హాస్పిటల్ నిలిచింది. ఇదే ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఉచితంగా విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లను అందించడమే కాకుండా నాణ్యమైన బోజన సౌకర్యం కూడా అందిస్తున్నట్టు వివరించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి విద్యావంతులను చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY