టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం హైదరాబాద్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షతన వహించిన రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు సమావేశంలో రాష్ట్రంలోని ప్రధాన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వీటిలో ముఖ్యంగా సెప్టెంబర్ 17, మునుగోడు ఉపఎన్నిక, జోడో యాత్రపై చర్చించామని వెల్లడించారు. సెప్టెంబర్ 17 అంశంతో బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని, నాడు రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను ఆమోదిస్తామని, జాతీయ జెండా మాదిరే తెలంగాణకు ప్రత్యేక జెండా రూపొందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇకపై తెలంగాణ అధికారిక రిజిస్ట్రేషన్ అయిన ‘టీఎస్’ ను ‘టీజీ’ గా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని, ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేరకు అధికారికంగా మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న మక్తల్ వద్ద తెలంగాణాలో అడుగు పెడుతోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ యాత్ర, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్దశంకరంపల్లి, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి వెళ్తుందని తెలియజేశారు. ఈ పాదయాత్రలో రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY