తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో బర్డ్ ఫ్లూ వ్యాధికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి తలసాని అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పక్షులకు సోకే ఈ వ్యాధిని ప్రస్తుతం దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వలన మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని అన్నారు.
1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ:
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభల కుండా అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్రంలోని కోళ్ళ నుండి 276 శాంపిల్స్ ను సేకరించి పరీక్షించడం జరిగిందని తెలిపారు. అన్ని స్థాయిలలోని అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ వ్యాధి ప్రధానంగా పక్షులు, కోళ్ళకు వ్యాపించే అవకాశం ఉందని, దేశంలో మన రాష్ట్రం కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి లో 3 వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కోళ్ళ పరిశ్రమల నిర్వాహకులను కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పలు సూచనలు, ఆరోగ్య శిభిరాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షుల వలన కొంత మేరకు ఈ వ్యాధి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రభలే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, స్నేహ ఫార్మ్స్ ప్రతినిధి గోపాల్ రెడ్డి, ఎన్ఈసీసీ ప్రతినిధులు ఏఈ కుమార్, సందీప్ చింతార్వార్, విబిఆర్ఐ జేడీ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ