రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయం నిర్మాణం, అంతర్గత సుందరీకరణ, ఫర్నిచర్ డిజైన్స్ ఉంటాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెక్రటేరియట్ నిర్మాణంపై గురువారం ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఆర్కిటెక్ట్ లు, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన సచివాలయంలోని ఫర్నిచర్, ఇంటీరియర్ లకు సంబంధించిన క్లాసికల్, సెమి క్లాసికల్, మాడ్రన్ డిజైన్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. ఆర్కిటెక్ట్ లు తయారు చేసిన ఇంటీరియర్ డిజైన్స్, వారు రూపొందించిన పలు ఫర్నిచర్ డిజైన్లను మంత్రి పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఇంటిరియర్స్ లో ఫ్యాన్లింగ్ పనులు, మౌల్డింగ్ పనులు, ఫాల్ సీలింగ్ డిజైన్ పనులు, రంగుల కూర్పు వాటికి క్లాసికల్, సెమి క్లాసికల్, మాడ్రన్ ప్యాట్రన్ లలో డిజైన్ తయారు చేసి సీఎం కేసీఆర్ కు సమర్పించాలని, ఆయన నిర్ణయం మేరకు డిజైన్ లు ఫైనల్ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది కోసం వర్కింగ్ స్టేషన్ నమూనాలు, కార్యదర్శుల ఛాంబర్ లు, మినిస్టర్స్ ఛాంబర్ లలో ఏర్పాటు చేసే ఫర్నిచర్ ల నమూనాలు కూడా పరిశీలించి వాటిలో నుండి 3 రకాల ఫర్నిచర్ లను షార్ట్ లిస్ట్ చేసి సీఎం పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రకారం ముఖ్యమంత్రి పేషీ, వీవీఐపీ వెయిటింగ్ హాల్, వీవీఐపీ డైనింగ్ హాల్, రెండు స్కై లాంజ్ లు, కేబినెట్ హాల్ డిజైన్ లు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండేలా చూడాలని ఆర్కిటెక్ లను మంత్రి ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా ఏకకాలంలో చేస్తూ సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్ లు ఆస్కార్, పొన్ని, షాపూర్ జి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ