‘సామాజిక సమస్యగా మారిన కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ట్రీట్ మెంటు తో పాటు వైరస్ ని ఎదుర్కొనే సంకల్పం, ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. 24 గంటలపాటూ వైద్యులు అందుబాటులోఉండాలి. ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్ జరగాలి. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని’ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇద్దరు మంత్రులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కరోనా వైరస్ నియంత్రణపై మంగళవారం నాడు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కరోనా వైరస్ విస్తృతి పరిస్థితులను కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 81 శాతం మంది కరోనా బాధితుల్లో ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అందులో కేవలం 19 శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ 14శాతం మంది నయం అవుతున్నారు. కేవలం 4 నుంచి 5 శాతం అంతకుముందే జబ్బులున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే సమస్య ఉంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం డాక్టర్లు, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పని చేయాలని ఆదేశాలిచ్చారు. ఇక నుంచి 24 గంటల పాటు కరోనాకి చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఉండాలి. ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే చికిత్సలు అందించాలి. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. కావాల్సిన ఇండెంట్లు పెట్టండి. ఏ ఒక్క పేషంట్ కి కూడా వైద్యం అందలేదన్న పేరు రావొద్దని మంత్రులు చెప్పారు. త్వరలోనే వరంగల్ లో అదనంగా 250 కరోనా పడకలు అందుబాటులోకి వస్తాయి. మరో 15రోజుల్లో పిఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ దవాఖానాని అందుబాటులోకి తెస్తామని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి వివరించారు.
ట్రీట్ మెంట్ తో పాటుగా ధైర్యాన్ని నింపాలి:
కేవలం ట్రీట్ మెంటు మాత్రమే రోగులను నయం చేయదు. అంతకంటే ధైర్యం కావాలి, కరోనా పట్ల భయాలు పోవాలి. నిజానికి మన దేశంలో కరోనా వైరస్ అమెరికా, యూరప్ వంటి దేశాల్లో మాదిరి సీరియస్ వైరస్ కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే నయం కావచ్చు. అందుకే ప్రజల్లో కరోనా వస్తే చస్తామనే భయాన్ని పోగొట్టాలి. నయమవుతామనే భరోసానివ్వాలి అన్నారు.
సహజ చావులను కరోనా మరణాలుగా చూడొద్దు:
ప్రతి రోజూ దేశంలో 3వేల మంది, రాష్ట్రంలో వెయ్యి మంది సహజంగా మరణిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చావూ కరోనా వల్లే అనడం సబబు కాదు. ప్రతి ప్రభుత్వ దవాఖానాలో ఆడిట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీయే ఆయా మరణాలను నిర్ధారిస్తుంది. అలాగని అన్ని చావులను కరో్నాకి అంటగట్ట వద్దని మంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు ఖర్చు చేసుకోవద్దు:
ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు తగలేసుకోవద్దు. నిజానికి కరోనాకి మందు లేదు. అలాగని కరోనా వైరస్ అంత సీరియస్ ది కాదు. అలాగని నిర్లక్ష్యం కూడా తగదు. కరోనా వైరస్ నుంచి బయట పడటానికి పెద్దగా ఖర్చు కాదు. ఈ విషయాలు తెలియక ప్రజలు ఆందోళన చెందొద్దు అన్నారు. కాకపోతే, ప్రాథమిక స్థాయిలోనే కరోనాని గుర్తించడం, వెంటనే చికిత్స తీసుకోవడం, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం, మాస్కులు ధరించడం, హోం క్వారంటైన్ లోఉండటం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, అధైర్య పడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి సూచిచంచారు.
నేటి నుంచే ‘నిదమ్’ యాప్ ఏర్పాటు, ఫోన్ ద్వారానే రిటైర్డ్ డాక్టర్లతో సలహాలు, సూచనలు:
నేటి నుంచే నిదమ్ యాప్ ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫోన్ లో ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. తమ సమస్యలు చెప్పి, కావాల్సిన సలహాలు, సూచనలు రిటైర్ అయిన సీనియర్ డాక్టర్ల నుంచి తీసుకోవచ్చని మంత్రులు వివరించారు. ఈ యాప్ ద్వారా హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి, ఇళ్ళల్లోనే ఉండే వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తుందని మంత్రులు వివరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, ధైర్యంగా ఉండాలని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎంజిఎంపై ప్రత్యేకంగా సమీక్ష:
మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంజిఎం హాస్పిటల్ పై ప్రత్యేకంగా చర్చించారు. నిబద్ధత, నిజాయితీ, సమన్వయంతో పని చేయాలని ఎంజిఎం డాక్టర్లను ఆదేశించారు. ఒక్క పేషంట్ కూడా వైద్యం అందలేదన్న పరిస్థితి రావొద్దన్నారు. కావాల్సిన మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సీజన్ వంటి అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. త్వరలోనే ఎంజిఎంకి ఫుల్ టైమ్ సూపరింటెండెంట్ ని నియమిస్తామని మంత్రులు చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu