ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్ కు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డ్ సీఈవో ఖాజా మైనోద్దిన్, జీహెఛ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.
అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్ కు ముస్లిం సోదరులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా రంజాన్ కు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రంజాన్ నేపథ్యంలో నెల రోజులపాటు ఉపవాసదీక్షలు చేపడతారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని మసీదుల వద్ద రోడ్ల మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత, లైట్ ల ఏర్పాటు వంటి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆటంకాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కొన్ని మసీదుల వద్ద వీధి కుక్కల బెడద ఉందని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలను తరలించి సమస్యను పరిష్కరించాలని జీహెఛ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజు మసీదుల లో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంటారని, వ్యర్ధాలను వేసేందుకు ప్రత్యేక డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలని, ప్రతినిత్యం ఆ వ్యర్ధాలను తరలించే విధంగా పర్యవేక్షణ జరపాలని శానిటేషన్ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE