బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి ఈరోజు కన్నుమూశారు. కాగా, జంగారెడ్డి మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా.. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ లో తెలిపారు. జంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు వేకువజామున తుదిశ్వాస విడిచారు. 1935వ సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో జన్మించారు జంగారెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యే గా, ఎంపీగా గెలిచారు జంగారెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి హన్మకొండ నుంచి ఎంపీగా గెలుపొంది 8వ లోక్ సభలో అడుగుపెట్టారు జంగారెడ్డి.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పై ఆయన గెలుపొందడం విశేషం. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీ లలో జంగారెడ్డి ఉన్నారు. అయితే, జంగారెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు సగౌరవంగా వీడ్కోలు తెలపాలని రాష్ట్ర బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. జంగారెడ్డి పార్థివ దేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. కార్యాలయంలో కొద్దిసేపు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు.. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నాయకులు జంగారెడ్డి మృతిపై తమ సంతాపాన్ని తెలిపారు. తదనంతరం ఆయన భౌతికకాయాన్ని హన్మకొండకు తరలించారు. కాగా, ఈరోజు సాయంత్రం జంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ