ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లును ప్రభుత్వం పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డిని ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ ఈ రోజు ఉదయం అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీక్ష ఇలాగే కొనసాగిస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని, బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కోదండరామ్ ఖండించారు. ముందుగా బీఎన్ రెడ్డి నగర్లోని తన నివాసంలో రెండు రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉంటూ దీక్షను కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డిని, నవంబర్ 17, ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజుల నుంచి దీక్ష చేయడంతో మధుమేహం, రక్తపోటుతో ఆయన ఆరోగ్యం క్షిణించిందని, తక్షణమే వైద్యం అందించాలని వైద్యులు ప్రకటించడంతో ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో వెంటనే వైద్యానికి సహకరించాలని అశ్వత్థామరెడ్డిని వైద్యులు కోరుతున్నారు. మరో వైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కో -కన్వీనర్ రాజిరెడ్డిని సైతం ఆదివారం నాడు మరోసారి అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్కు తరలించగా, పోలీసు స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డిని సాయంత్రం వదిలిపెట్టారు. దీక్షను విరమించాలని పోలీసులు కోరినా ఇంటికి చేరుకొని తలుపు గడియపెట్టుకుని దీక్ష కొనసాగిస్తుండంతో, ఆదివారం నాడు ఇంటి తలుపులు పగులగొట్టి రాజిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
[subscribe]