పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 13 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన తరువాత మొదటగా, ఇటీవల మరణించిన ప్రముఖులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాంజెఠ్మలానీ, గురు దాస్ దాస్గుప్తాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల లోక్ సభకు ఎన్నికయిన సభ్యుల చేత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పరిస్థితుల గురించి కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్ర రైతుల సమస్యలపై శివసేన, కశ్మీర్లో నిర్బంధంలో ఉంచిన నేతల అంశంపై టీఎంసీ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
2019 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండవ పార్లమెంటు సమావేశాలు ఇవి. ఈ శీతాకాల సమావేశాల్లో 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆర్డినెన్స్ల స్థానంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం, కార్పొరేట్ టాక్స్ సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సవరణ బిల్లు, చిట్ ఫండ్స్ సవరణ బిల్లు, ది సర్రోగసీ రెగ్యులేషన్ బిల్లు, ఇంటర్-స్టేట్ నదుల నీటి వివాదాలు సవరణ బిల్లు, ఆనకట్ట భద్రత, లింగమార్పిడి వ్యక్తులు హక్కుల పరిరక్షణ, రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ సవరణ తదితర బిల్లులను ఈ సమావేశాలలో చర్చింది ఆమోదించనున్నారు. అలాగే 1952లో రాజ్యసభ ప్రారంభం కాగా, ఈ సమావేశాలతో రాజ్యసభ 250వ మార్కు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
[subscribe]