తెలంగాణ రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 378 మంది తహసీల్దార్లను ఒకేసారిగా బదిలీ చేసింది. వీరిలో జోన్ 5 కు సంబంధినవారు 166 మందికాగా, జోన్ 6 చెందినవారు 122 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని, తిరిగి వారి సొంత జిల్లాలకే పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ నవంబర్ 17, ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దార్ బదిలీల ప్రక్రియను పూర్తి చేసినందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవిందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, తదితరులు ఆదివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా తమను బదిలీ చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపే మార్గదర్శకాలను సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా తహసీల్దార్లను వెంటనే వారి సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]