మార్చి 15వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనమండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి:
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “రానున్న శాసనసభ, శాసన మండలి సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అవాంతరాలు లేకుండా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. సభలో సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేలా అన్ని చర్యలు తీసుకోవాలి. గతంలోని పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు కూడా త్వరగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి కూడా సమావేశాలలో కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది. శాసనసభ్యుల మరియు సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనలు. పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ, జీహెఛ్ఎంసీల ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరంలో మరియు పరిసరాలలో శానిటైజేషన్ కార్యక్రమాలు రోజుకు రెండు సార్లు చేపడతాం. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తాం. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. శుక్రవారం సాయంత్రం నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నాం. శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మంత్రుల సిబ్బంది, అసెంబ్లీ మార్షల్స్ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ రిపోర్టు వస్తే సభ్యులు, సిబ్బంది ఎవ్వరు కూడా అసెంబ్లీ ఆవరణలోకి, సభకు రావద్దు” అని పేర్కొన్నారు.
అధికారుల సమావేశంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడి) వికాస్ రాజ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, సెక్రటరీ (హెల్త్ డిపార్ట్మెంట్) రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి పాల్గొన్నారు.
పోలీసుశాఖ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీ(ఎస్పీఎఫ్) హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, ఇంటెలీజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబరాబాద్), అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్), అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ