రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈసారి భద్రాద్రిలో ఏప్రిల్ 2 న జరిగే శ్రీరామనవమి వేడుకలకు భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా రాములవారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. భక్తులకు ప్రవేశం లేకపోవడంతో కోవెల ప్రాంగణంలో స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మరియు ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఈ వేడుకులకు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సుమారు 40 మందితో కూడిన వేదపండితులు, అర్చకులు, పోలీసులు, అధికారులు, ఆలయ ప్రతినిధులు సమక్షంలోనే రాములవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఇక ఏప్రిల్ 3, శుక్రవారం నాడు శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నారు.
[subscribe]