హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు కష్టమైనా బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20 ఏళ్ల వార్షికోత్సవ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కృషి ఫలితంగా స్థాపించబడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సిబ్బందితో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ 20 ఏళ్ళ క్రిందటి అద్భుత క్షణాలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అలాగే ఐఎస్బీ క్యాంపస్లో 11 ఏళ్ల క్రితం తాను నాటిన చెట్టును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మనదేశ యువతలో నైపుణ్యానికి కొదువ లేదని, వారిని సరైన దిశగా నడిపిస్తే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని కొనియాడారు. ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు హైదరాబాద్ నగరంలో ఐఎస్బీ ఏర్పాటుకు కృషి చేశానని, దీనికి నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి సహకరించారని తెలిపారు. అలాగే ప్రపంచ భవిష్యత్ అంతా సాఫ్ట్వేర్ మీద ఆధారపడనుందని అప్పుడే గుర్తించానని, అందుకే ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టానని చంద్రబాబు చెప్పారు. సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత హైదరాబాద్లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, దీనిలో భాగంగానే మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందని ఆయన వెల్లడించారు. కష్టమైనా మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ను ఒప్పించి కార్యాలయం ఏర్పాటు చేశానని, అనంతరం పలు ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చాయని తెలియజేశారు. ఇక తాను 2000వ సంవత్సరంలో సీఎంగా ఉన్న సమయంలో ‘విజన్-2020’ అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారని, అయినా వెనుకడుగు వేయకుండా ముందుకే సాగానని తెలిపిన చంద్రబాబు నాయుడు, అప్పుడు తాను కన్న కల నేడు సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ