బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘాలుగా ఏర్పడి నిర్మాణాలు చేసుకోవడానికి బీసీ కులసంఘాలకు ఈ నెల 14వ తారీకు వరకు తుది గడువు ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రాజదాని నడిబొడ్డున వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు, రూ.96 కోట్లు కేటాయించామని, వీటిని నిర్మించుకోవడానిక ఏక సంఘంగా ముందుకు వచ్చిన బీసీ సంఘాలకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగిస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు దఫాలుగా బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహించామని, ఇప్పటివరకూ 18 సంఘాలు ఏకసంఘంగా ఏర్పడ్డాయని ఈనెల 14 వరకూ మిగతా సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి తుది అవకాశం ఇస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఏక సంఘంగా రాని వాటిపై గడువు తర్వాత 15వ తారీకు నుండి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి వెల్లడించారు.
నిరుద్యోగులకు నాణ్యమైన కోచింగ్ అందించేందుకు బీసీ స్టడీ సర్కిళ్లు సర్వం సిద్దం:
అలాగే బీసీ స్టడీ సర్కిళ్లు గురించి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నియమించబోయే 80039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణను ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్ 1 కోచింగ్ ప్రారంభమైందని, ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంబిస్తామని, నోటిఫికేషన్లు విడుదలైన ప్రకారం ఆయా పోస్టుల కోచింగ్ అందిస్తామన్నారు. మహాత్మా జ్యోతిభాపూలే గురుకులాల్లోనూ రాబోయే విద్యాసంవత్సరంకు సంబందించి అన్ని ప్రణాళికలు సిద్దం చేసి నాణ్యమైన విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్, ఎంజేపీ స్కూల్స్ సెక్రటరీ మల్లయ్య బట్టు, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అలోక్ కుమార్, సంధ్య, ఫెడరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్స్ బాలా చారి, విమల, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ