వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించగా.. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో లేదని, ఆ పార్టీ చేస్తున్న యాత్రలతో ఎలాంటి ఉపయోగం లేదని, అధికారంలోకి రాలేమని ముందే డిసైడ్ అయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం సాధారణ విషయంగా భావిస్తున్నారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే గెలిచిన తర్వాత బీఆర్ఎస్కు వెళ్తారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని అంటున్నారని, మరి అలాంటప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసే పోటీ చేస్తాయని, ఈ మేరకు ఢిల్లీ లెవెల్లో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ భయంతోనే బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని, ఎన్నికల వరకు తన్నుకుని, అప్పుడు కలిసి పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్కు వయసు పెరిగినందువల్ల కొన్ని విషయాలు గుర్తు లేవని, అందుకే ఆయన ఇంకా ఈటల రాజేందర్ వాళ్ళ పార్టీలోనే ఉన్నారని అనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, సంకీర్ణం వస్తుందని, కెసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE