రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు మరియు వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరయి వున్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది.
మరోవైపు వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని, ప్రస్తుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్తుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, ఆ వివరాలను తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ