నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ కోసం పోరాడిన మరియు దేశం కోసం త్యాగాలు చేసిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను అని చెప్పారు. గత ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్డిపి) లో 14.84 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవని, ఇప్పుడు 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, రెవెన్యూ డివిజన్లను 43 నుండి 69 కి పెంచాం, 459 మండలాలు 584 గా మారాయి. తెలంగాణాలో 68 మునిసిపాలిటీల నుండి 142 కు పెంచారు. కొత్తగా 7 మునిసిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుని, వాటి సంఖ్యను 13 కి పెంచామని, సుపరిపాలన కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ విధానం దేశవ్యాప్తంగా ఇతరులకు ఆదర్శంగా మారిందని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాలలో భాగంగా ఐక్యరాజ్యసమితి మన రైతు బంధు, రైతు భీమా విధానాలను చేర్చడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని చెప్పారు. ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన కాళేశ్వరం ప్రాజెక్టును మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో ఇటీవల ప్రారంభించామని, ఇటువంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి, సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారు. ప్రతిరోజూ మూడు షిఫ్టులలో పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేసిన కార్మికులు, అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త జోనల్ వ్యవస్థ, గ్రామాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ, పచ్చదనం పెంచే కార్యక్రమం, పాలమూరు ప్రాజెక్టులు, వైద్యం, హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
[subscribe]
[youtube_video videoid=5m0N2AGzanA]